మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు అంశం మరింత ఉత్కంఠగా మారుతున్న వేళ.. టీవీకే అధినేత విజయ్కు తొలి అవకాశం ఇవ్వాలని సీపీఐ, వీసీకే పార్టీలు గవర్నర్ను కోరాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశాయి.టీవీకే 108 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలిచిందని, రాజ్యాంగ పరంగా ముందుగా ఆ పార్టీకి అవకాశం ఇవ్వడం సముచితమని ఈ పార్టీలు అభిప్రాయపడ్డాయి. విజయ్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడంతో పాటు, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం కల్పించాలని కోరాయి.తమిళనాడులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. డీఎంకే కూడా టీవీకేకు తొలి అవకాశం ఇవ్వాలని సూచించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.సీపీఐ నేతలు మాట్లాడుతూ.. గవర్నర్ రాజ్యాంగ పరిమితుల్లోనే వ్యవహరించాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని కోరారు. అతిపెద్ద పార్టీగా ప్రజల మద్దతు పొందిన టీవీకేకు అవకాశం ఇవ్వకపోతే ప్రజా తీర్పును అవమానించినట్లవుతుందని పేర్కొన్నారు.ఇప్పటికే విజయ్ రెండుసార్లు గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడంతో టీవీకే బలం పెరిగినా.. ఇంకా పూర్తి మెజారిటీకి అవసరమైన సంఖ్య కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు సమాచారం.విజయ్కు అవకాశం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. టీవీకే కార్యకర్తలు, అభిమానులు గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
