మే 07, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, వాహనాలపై జరిగిన దాడులను మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ శ్రేణులు పట్టపగలు గూండాల్లా దాడులకు పాల్పడటం దుర్మార్గమని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇలాంటి పిరికిపంద చర్యలకు ప్రోత్సాహం ఇస్తున్నారని ఆరోపించారు.ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై దాడి జరగడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని కేటీఆర్ పేర్కొన్నారు. దాడి జరిగిన వెంటనే కౌశిక్ రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. క్యాంపు కార్యాలయంలోకి చొరబడి వాహనాలు, ఫర్నిచర్ ధ్వంసం చేయడం తీవ్రంగా ఖండించాల్సిన చర్య అన్నారు.పోలీసులు కళ్లముందే అరాచకం జరుగుతున్నా ప్రేక్షక పాత్ర పోషించడం సిగ్గుచేటని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి బీ-టీంగా మారిన బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి శాంతిభద్రతలను కాపాడాల్సింది పోయి తన అనుచరులతోనే ఉద్రిక్తతలు సృష్టించడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. కరీంనగర్ ప్రజలకు అభివృద్ధి పరంగా చేసిందేమీ లేకపోయినా రాజకీయ దాడులతో వార్తల్లో నిలవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
