మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ మధ్య నటుడు విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)కి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని గవర్నర్ను ఆయన డిమాండ్ చేశారు.ప్రజలు స్పష్టంగా టీవీకేకు అత్యధిక స్థానాలు ఇచ్చారని, అలాంటి పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఇప్పటివరకు ఆహ్వానించకపోవడం ఆశ్చర్యకరమని విశాల్ వ్యాఖ్యానించారు. గతంలో కర్ణాటక, గోవా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీలకు ఫ్లోర్ టెస్ట్ అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.“అప్పుడు పాటించిన రాజ్యాంగ సంప్రదాయాలు ఇప్పుడు ఎందుకు అమలు కావడం లేదు? విజయ్కు కూడా శాసనసభలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి కదా” అంటూ విశాల్ ప్రశ్నించారు. ప్రజా తీర్పును గౌరవించడం రాజ్యాంగబద్ధ బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు.తమిళనాడుకు ఎన్నికైన ప్రభుత్వం త్వరగా రావాల్సిన అవసరం ఉందని, గవర్నర్ పాలన తరహా పరిస్థితులు కొనసాగకూడదని విశాల్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితిపై ప్రజల్లో ఆందోళన నెలకొందని తెలిపారు.ఇప్పటికే కమల్ హాసన్, సీపీఐ, వీసీకే, డీఎంకే వంటి పార్టీలు కూడా టీవీకేకు తొలి అవకాశం ఇవ్వాలని కోరగా.. తాజాగా విశాల్ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరింత చర్చకు దారితీశాయి.
