మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠపై నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచినా విజయ్కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు.విజయ్ను “రాజకీయ అభిమన్యుడిగా” మార్చే ప్రయత్నం జరుగుతోందని పోసాని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం అతిపెద్ద పార్టీకి ముందుగా అవకాశం ఇవ్వాల్సిందని, కానీ ముందుగానే మెజారిటీ నిరూపించుకోవాలని ఒత్తిడి తేవడం సరైన విధానం కాదన్నారు.“ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. విజయ్ను అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది” అని పోసాని మండిపడ్డారు.విజయ్తో తనకు 1996 నుంచే పరిచయం ఉందని, ఆయన ఎప్పుడూ అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదని చెప్పారు. సంయమనంతో వ్యవహరించే వ్యక్తిత్వం విజయ్దని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే తీరు కొనసాగిస్తున్నారని ప్రశంసించారు.తమిళనాడులో టీవీకే తొలి ఎన్నికల్లోనే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలవడం సంచలనమైందన్నారు. ఇప్పటికే కమల్ హాసన్, విశాల్, సీపీఐ, వీసీకే, డీఎంకే వంటి పలువురు విజయ్కు అవకాశం ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో పోసాని వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి.
