మే 08, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్ను వచ్చే పదేళ్లలో గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ముంబైలో జరిగిన ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగర మౌలిక వసతుల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ ద్వారా దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. అస్తవ్యస్త పట్టణీకరణ వల్ల ప్రపంచంలోని అనేక నగరాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని, అలాంటి పరిస్థితి హైదరాబాద్కు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాలు, రీజినల్ రింగ్ రోడ్, మూసీ ప్రక్షాళన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐకం ఇన్నోవేషన్ హబ్ వంటి ప్రాజెక్టులను ప్రభుత్వం చేపడుతోందని మంత్రి వివరించారు.హైదరాబాద్లో ఐటీతో పాటు బ్యాంకింగ్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, రక్షణ, స్పేస్ టెక్ రంగాలకు చెందిన గ్లోబల్ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. గత ఏడాది 70కి పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది మరో 100 జీసీసీలు ఏర్పాటు చేసి లక్ష మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.జీసీసీలను కేవలం బ్యాక్ ఆఫీస్ కేంద్రాలుగా కాకుండా ‘గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా’ అభివృద్ధి చేయడానికి ప్రత్యేక రోడ్మ్యాప్ సిద్ధం చేస్తున్నామని శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
