మే 08, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో ఈ నెల 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే ఈ సభ కోసం బీజేపీ నాయకత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది.సభా ప్రాంగణాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించి, ప్రజలకు కల్పిస్తున్న సదుపాయాలు, పార్కింగ్, తాగునీరు, వైద్య సేవలు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు.ఈ పరిశీలనలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ బీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్కా కొమురయ్య, అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని సభ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు, కేంద్ర భద్రతా సంస్థలతో కలిసి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. సభ ప్రాంగణం పరిసరాల్లో సీసీ కెమెరాలు, చెక్పోస్టులు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నారు.సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పార్కింగ్, రవాణా, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని బీజేపీ నేతలు తెలిపారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ సభకు ప్రత్యేక ప్రాధాన్యం నెలకొంది. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
