మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని తెలిపారు.ఈ నెల 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న ప్రధాని మోదీ సభ ఏర్పాట్ల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు.ప్రధాని సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సభకు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.“నిన్నటి నుంచి ఎండలు కూడా తగ్గాయి. ప్రకృతి కూడా మోదీకి స్వాగతం పలుకుతున్నట్టుంది” అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఈ సభ కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.
