మే 08, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వం ఉండొద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రెండు లక్షల మంది లబ్ధిదారులకు వెంటనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున స్థలాలు కేటాయించాలని సూచించారు. పేదలకు సొంతిల్లు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన–ఎన్టీఆర్ 2.0 పథకం కింద ఈ నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం లక్ష ఇళ్లను మంజూరు చేయనున్నట్లు గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు.ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
