Breaking News

తెలంగాణ బీడీ కార్మికులకు వేతనాల పెంపు

మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో లక్షలాది మంది బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. బీడీ యాజమాన్యాలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు సఫలమవడంతో కార్మికుల వేతనాలను పెంచుతూ కొత్త ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2028 ఏప్రిల్‌ 30 వరకు అమల్లో ఉండనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు దీనివల్ల లబ్ధి పొందనున్నారు.కొత్త ఒప్పందం ప్రకారం వెయ్యి బీడీలకు కార్మికులకు చెల్లించే వేతనాన్ని రూ.6 మేర పెంచారు. ఇప్పటివరకు వెయ్యి బీడీలకు రూ.268.31 చెల్లిస్తుండగా, ఇకపై రూ.275.23 చెల్లించనున్నారు. జాతీయ సెలవులు, బోనస్‌, ఇతర ప్రయోజనాలు కలుపుకుంటే మొత్తం పెరుగుదల రూ.6.92కు చేరనుంది.తెలంగాణలో బీడీ పరిశ్రమ ప్రధానంగా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. బీడీ కార్మికుల్లో దాదాపు 98 శాతం మంది మహిళలే ఉండటం విశేషం. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, సిరిసిల్ల, మెదక్‌, సిద్ధిపేట జిల్లాల్లో ఈ పరిశ్రమ విస్తృతంగా కొనసాగుతోంది.పెరుగుతున్న నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులు, కుటుంబ భారం మధ్య ఈ వేతనాల పెంపు కొంత ఊరటనిస్తుందని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ప్రస్తుత జీవన వ్యయాలకు ఇది పూర్తిగా సరిపోదని, భవిష్యత్తులో మరింత వేతన పెంపు కోసం పోరాటం కొనసాగిస్తామని సంఘాల నేతలు పేర్కొన్నారు.బీడీ కార్మికులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వేతనాలతో పాటు ఆరోగ్య భద్రత, బీమా, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

మహిళా సాధికారతకు కొత్త దిశ.. తెలంగాణలో జిల్లా మహిళా సమాఖ్య భవనాలు సిద్ధం

కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *