మే 08, (నేటి తెలుగు పత్రిక): కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనపై పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాప్లో ప్రయాణికులు వేచి ఉన్నప్పటికీ బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే స్వయంగా స్పందించి బస్సును అడ్డగించి డ్రైవర్, కండక్టర్ను ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కంకిపాడు సినిమా హాల్ సెంటర్ బస్టాప్ వద్ద పలువురు ప్రయాణికులు బస్సు కోసం ఎదురుచూస్తుండగా, ఆర్టీసీ బస్సు ఆగకుండా వెళ్లిపోయింది. అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఈ విషయాన్ని గమనించి తన కారుతో బస్సును వెంబడించి రోడ్డుపైనే నిలిపివేశారు. బస్సులోకి ఎక్కిన ఎమ్మెల్యే డ్రైవర్, కండక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “ప్రజల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆర్టీసీ సేవలు అందిస్తోంది. ప్రయాణికులను ఎక్కించకుండా వెళ్లిపోవడం సరైంది కాదు” అని హెచ్చరించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ప్రయాణికులు కూడా బస్సులు సమయానికి రావడం లేదని, కొన్ని చోట్ల ఆగకుండా వెళ్లిపోతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ అధికారులతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు.ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు కూడా స్పందించి, బస్సు ఎందుకు ఆగలేదన్న విషయంపై విచారణ చేపడుతున్నామని తెలిపారు. అవసరమైతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
