అమరావతి, మే 08, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ-ఫైళ్ల క్లియరెన్స్లో సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. గతంలో ఫైళ్ల పరిష్కారానికి సుమారు 5 గంటలు పట్టగా, ప్రస్తుతం భారీ సంఖ్యలో ఫైళ్లు వచ్చినప్పటికీ సగటున కేవలం 2 గంటల 49 నిమిషాల్లోనే క్లియర్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో మంత్రి అచ్చెన్నాయుడు తీసుకుంటున్న చర్యలు ప్రభుత్వ యంత్రాంగంలో చురుకుదనాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఈ-ఫైళ్ల పరిష్కారాన్ని రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి తీసుకురావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పారదర్శకత, వేగం, సమర్థతతో పనిచేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు పనితీరును సీఎం ప్రత్యేకంగా అభినందించినట్లు అధికారులు తెలిపారు. ఆయన నాయకత్వంలో వ్యవసాయ, అనుబంధ శాఖల పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతోందని పేర్కొన్నారు.
