మే 08, (నేటి తెలుగు పత్రిక): ‘వందేమాతరం’ గీతానికి జాతీయ గీతం ‘జనగణమన’తో సమాన చట్టబద్ధ రక్షణ కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. వందేమాతరం ఒక దేవతను కీర్తించే గీతమని, దానిని జాతీయ గీతంతో సమానంగా చూడలేమని పేర్కొన్నారు.ఈ అంశంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఓవైసీ.. “జనగణమన భారతదేశాన్ని, ప్రజలను కీర్తిస్తుంది. అది ఏ ఒక్క మతానికీ చెందినది కాదు. కానీ వందేమాతరం ఒక దేవతను కీర్తించే విధంగా ఉంటుంది” అని వ్యాఖ్యానించారు.రాజ్యాంగ ప్రవేశికలో “ప్రజలమైన మేము” అనే పదాలు ఉన్నాయని, “భారత మాత” అనే పదం ఎక్కడా లేదని గుర్తు చేశారు. “దేశమంటే ఒక దేవత కాదు.. అది ప్రజల సమూహం” అని ఓవైసీ పేర్కొన్నారు. వందేమాతరం గీతంపై రాజ్యాంగ పరిషత్లో గతంలో చర్చ జరిగిందని, చారిత్రక, రాజ్యాంగ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ‘జనగణమన’ను జాతీయ గీతంగా స్వీకరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో వందేమాతరానికి అదే స్థాయి చట్టబద్ధ రక్షణ ఇవ్వడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అధికార పార్టీ నేతలు సమర్థిస్తున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం కీలక పాత్ర పోషించిందని, దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని పేర్కొంటున్నారు.ఈ అంశంపై రాజకీయ, సామాజిక వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా చర్చ కొనసాగుతోంది.
