మే 08, (నేటి తెలుగు పత్రిక): అర్జీలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలక్ష్యం సహించబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు కలెక్టర్లు ప్రజల నుంచి తీసుకున్న అర్జీలను కార్లలోనే పడేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని హెచ్చరించారు.7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు నిర్వహించిన సమీక్షలో సీఎం ఫైళ్ల క్లియరెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఈ-గవర్నెన్స్, డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ అంశాలపై అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడం మంచి పరిణామమన్నారు. వేగంగా ఫైళ్లు క్లియర్ చేస్తున్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలను అభినందించారు. భారీ సంఖ్యలో ఫైళ్లు వచ్చినా సగటున 10 గంటల్లో పరిష్కరిస్తున్న సీఎస్ సాయి ప్రసాద్ పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు.గత మూడు నెలలతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఫైళ్ల పరిష్కార సమయం 10 రోజుల నుంచి 2 రోజులకు తగ్గిందన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతమైతే ప్రభుత్వ సేవలు ప్రజలకు త్వరగా అందుతాయని పేర్కొన్నారు.24 గంటల్లోపు ఈ-ఫైళ్లు పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు. మ్యానువల్ ఫైళ్లను పూర్తిగా తగ్గించి, అన్ని శాఖల్లో ఈ-ఆఫీస్ వ్యవస్థను సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు.పాలనలో టెక్నాలజీతో పాటు మానవీయ కోణం కూడా అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించే విషయంలో కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు.ఇక అన్ని శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే డ్యాష్బోర్డ్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. 90 రోజుల్లో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.
