మే 08, (నేటి తెలుగు పత్రిక): పెన్షన్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.విజయవాడలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సూచనలతో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ హామీలను దశలవారీగా అమలు చేస్తోందని, ప్రజలు కూడా ప్రభుత్వ పనితీరుపై సానుకూలంగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ పాలనలో ప్రజల వద్దకు అధికారులు, నేతలు వెళ్లలేదని విమర్శించారు. విజయవాడలో డ్రైనేజీ సమస్యలు, కొండ ప్రాంత ప్రజల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. జీవో నంబర్ 30 ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు అందించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంగా పనిచేస్తున్నామని ఎంపీ శివనాథ్ వెల్లడించారు.
