మే 08, (నేటి తెలుగు పత్రిక): మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతో అమలు చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఆస్తులకు నష్టం జరగకుండా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో మూసీ ప్రాజెక్టుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 55 కిలోమీటర్ల పరిధిలో ఐదు దశల్లో ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. తొలి దశకు రూ.7,055 కోట్ల వ్యయం అంచనా వేశారు. హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొదటి ఐదు కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.మూసీ నదిలో చెత్త తొలగింపు, రివర్ బెడ్ ప్రొఫైలింగ్, వరద నియంత్రణ కోసం రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపట్టనున్నారు. నది ఇరువైపులా రోడ్లు, మురుగు కాలువలు, బ్యారేజీలు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు కూడా చేపట్టాలని నిర్ణయించారు.నార్సింగి నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉప్పల్ భగాయత్ నుంచి గౌరెల్లి వరకు విస్తరణకు డీపీఆర్ రూపొందించనున్నారు. ప్రాజెక్టు వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నగరవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సబ్ కమిటీ సూచించింది. బస్టాండ్లు, ప్రధాన రహదారులు, థియేటర్లలో ప్రచార వీడియోలు ప్రదర్శించనున్నారు.2026 ఆగస్టు నాటికి పనులు ప్రారంభించి, 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టు సాంకేతిక పర్యవేక్షణలో ఐఐటీ, జేఎన్టీయూ సంస్థల సహకారం తీసుకోనున్నారు.
