మే 09, (నేటి తెలుగు పత్రిక): అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. 2027 డిసెంబర్ నాటికి చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి (కొడంగల్ బాలాజీ) ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం భూమి పూజ చేసి, యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కొడంగల్లో 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, కోస్గి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతాన్ని విద్య, వైద్యం, పరిశ్రమలు, సాగునీటి రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, సైనిక్ స్కూళ్లతో 225 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఒకప్పుడు చదువుకోడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు కొడంగల్కు వచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.మక్తల్–నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి అందించాలని, ప్రాజెక్టు పనులపై ప్రతి నెల సమీక్ష నిర్వహించాలని జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. భూసేకరణ, అనుమతుల ప్రక్రియ పూర్తయిందని, పనులు వేగవంతం చేయాలని సూచించారు.కృష్ణా–వికారాబాద్ రైల్వే లైన్కు సూత్రప్రాయ అనుమతి వచ్చిందని, కోస్గి నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 300 అడుగుల రహదారి నిర్మాణం చేపడుతున్నామని సీఎం వెల్లడించారు.టేకులగోడు ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామని, ఆరు నెలల్లో పరిశ్రమ నిర్మాణం ప్రారంభమైతే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. లగచర్ల వద్ద భారీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొడంగల్ బాలాజీ ఆలయాన్ని తెలంగాణ పేదల తిరుపతిగా అభివృద్ధి చేయాలని సంకల్పించామని సీఎం అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆశీస్సులతో ఆలయ పునర్నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు.ఆగమశాస్త్ర నిపుణుడు సుందర వరదాచార్యుల చివరి కోరిక మేరకు ఆలయ అభివృద్ధి పనులు చేపట్టామని, ఆయన జ్ఞాపకార్థం ఆలయ ప్రాంగణంలో ఒక విడిదికి ఆయన పేరు పెట్టాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమని, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు కూడా ఉపయోగపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.



