మే 09, (నేటి తెలుగు పత్రిక): పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం (కొడంగల్ బాలాజీ) పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన భూమి పూజ, యాగ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు.ఈ సందర్భంగా కొడంగల్ బాలాజీ ఆలయ పునర్నిర్మాణంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. కొడంగల్లో 430 పడకల ఆధునిక ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు.ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. కొడంగల్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
