మే 09, (నేటి తెలుగు పత్రిక): మైనారిటీ విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి, అందులో నైపుణ్యాభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సంప్రదాయ కోర్సులతో పరిమితం కాకుండా ఉపాధికి ఉపయోగపడే కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం ఈ సూచనలు చేశారు. ప్రతిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందిస్తున్నట్లే మైనారిటీ విద్యార్థులకు కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలని ఆదేశించారు.గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల్లో ఎంపికైన మైనారిటీ అభ్యర్థుల్లో ఆసక్తి ఉన్నవారిని మైనారిటీ సంక్షేమ శాఖలో భాగస్వామ్యం చేసి, శాఖ కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే విద్యార్థులకు ప్రేరణ కలిగించేందుకు గ్రూప్స్లో ఎంపికైన అధికారులు, క్రీడాకారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.ఇమామ్లు, మౌజమ్లకు అందించే గౌరవ వేతనాలను సమయానికి విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఖబర్స్తాన్లకు స్థలాలు కేటాయిస్తామని తెలిపారు.డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు రీట్రోఫిట్టింగ్ ప్రణాళిక రూపొందిస్తున్నామని సీఎం వెల్లడించారు. దీంతో ఆటోడ్రైవర్లకు ఇంధన ఖర్చులు తగ్గి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు.మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా గుడి, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మాణాలను చేపట్టాలని సీఎం ఆదేశించారు. భారతదేశ వైవిధ్య సంస్కృతిని, తెలంగాణ గంగా-జమునా తెహ్జీబ్ను ప్రతిబింబించేలా ఈ నిర్మాణాలు ఉండాలని పేర్కొన్నారు. ఇవి భవిష్యత్తులో సంస్కృతి అధ్యయన కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు.ఈ సమావేశంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీజీఎంఆర్ఈఐఎస్ అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.




