మే 09, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.పని మనిషి కల్పనతో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, లక్నోతో పాటు నేపాల్కు కూడా పోలీసు బృందాలు వెళ్లినట్లు సమాచారం. గతంలో లక్నోలో కల్పన పని చేసిన ఇంటి యజమానులను పోలీసులు విచారించగా, తమ ఇంట్లోనూ బంగారం, నగదు మాయమైనట్లు వారు వెల్లడించినట్టు తెలిసింది. దీంతో ఆమెపై పాత కేసుల కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.హత్య అనంతరం నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్లో పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాజీ ఐపీఎస్ నివాసం, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు.ఇవాళ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తనూజ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు.
