మే 09, (నేటి తెలుగు పత్రిక): అక్రమ నిర్మాణాలను కట్టుదిట్టంగా అరికట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజు సందర్భంగా నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ సూచనలు చేశారు.అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలపై ఎలాంటి ఉదాసీనత చూపరాదని సీఎం హెచ్చరించారు. అక్రమ కట్టడాలపై పర్యవేక్షణను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని స్పష్టంగా సూచించారు.స్థానిక సంస్థలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పారు.అలాగే తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందేలా ఆర్టీజీఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు.
