మే 09, (నేటి తెలుగు పత్రిక): డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలానికి చెందిన షెహనాజ్ మస్కట్ నుంచి సురక్షితంగా స్వగ్రామానికి చేరుకుంది.కుటుంబ జీవనం కోసం ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లిన షెహనాజ్ అక్కడ పని చేస్తూ తీవ్ర వేధింపులకు గురైనట్లు తెలిపింది. జీతం ఇవ్వకపోవడం, దుర్వ్యవహారం ఎదురవుతున్న పరిస్థితిని భర్తకు వీడియో కాల్ ద్వారా తెలియజేసింది. తనను రక్షించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కూడా వేడుకుంది.విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ తన కార్యాలయ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికారులు రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి షెహనాజ్ను రప్పించారు.మస్కట్ నుంచి ముంబై, అక్కడి నుంచి విజయవాడ మీదుగా వాల్మీకిపురం వరకు ఆమెను సురక్షితంగా తీసుకువచ్చారు. ఈ ప్రక్రియ కేవలం ఐదు రోజుల్లో పూర్తయింది. స్వగ్రామానికి చేరుకున్న అనంతరం డిప్యూటీ సీఎం పేషీ అధికారులు షెహనాజ్కు రూ.30,000 నగదు, చీర అందజేశారు. ఆమెకు అవసరమైన సహాయాన్ని కూడా అందించారు.తనను కష్టాల నుంచి రక్షించి స్వగ్రామానికి చేర్చినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డికి షెహనాజ్ కృతజ్ఞతలు తెలిపింది.
