మే 09, (నేటి తెలుగు పత్రిక): ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యువత, విద్యార్థులు, శ్రోతలను భాగస్వామ్యం చేస్తూ “గళం సెల్” ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు చేపట్టనున్నారు.విజయవాడలో ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు భారీ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్థానిక కళాకారులకు ప్రోత్సాహం అందించేలా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.ఈ వేడుకల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యువజన గానం, వేంపులేటి అయ్యప్పస్వామి బృందం గరగ నృత్య ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వివిధ పోటీల్లో విజేతలకు ఒక్కో విభాగంలో రూ.500 చొప్పున బహుమతులు అందజేయనున్నారు. అలాగే సుమారు 400 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేయనున్నారు. గత ఆరేళ్లుగా నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొంటూ ఆకాశవాణి అభిమానులు తమ ప్రతిభను చాటుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు.
