మే 09, (నేటి తెలుగు పత్రిక): నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంతో ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం ప్రకారం బస్సులో సుమారు 46 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద సమయంలో చాలామంది నిద్రలో ఉండటంతో ఒక్కసారిగా బస్సు పల్టీ కొట్టడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసి అంబులెన్స్ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సు ఫిట్నెస్, డ్రైవర్ విధుల సమయం, వాహన సాంకేతిక పరిస్థితులపై అధికారులు విచారణ చేపట్టారు.ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలగగా, పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. బాధితులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ వాహనాల ఏర్పాట్లు చేస్తున్నారు.
