మే 09, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మెజార్టీకి కేవలం రెండు స్థానాల దూరంలో నిలిచిన టీవీకే, మద్దతు కూడగట్టేందుకు కీలక రాజకీయ సంప్రదింపులు ప్రారంభించింది.ఈ నేపథ్యంలో సీవీకే అధినేత తోల్. తిరుమావళవన్ను విజయ్ స్వయంగా కలవనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తాజా ఫలితాల్లో టీవీకే 116 స్థానాలు సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటు కోసం మద్దతు కీలకంగా మారింది.ఎన్నికల ఫలితాల అనంతరం టీవీకే కార్యాలయాల వద్ద భారీ సంబరాలు జరిగాయి. యువత, పట్టణ ఓటర్ల నుంచి విజయ్కు విశేష ఆదరణ లభించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యానికి ప్రత్యామ్నాయ శక్తిగా టీవీకే ఎదగడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది.ప్రస్తుతం స్వతంత్ర ఎమ్మెల్యేలు, చిన్న పార్టీలతో టీవీకే నాయకత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు డీఎంకే, అన్నాడీఎంకే కూడా రాజకీయ సమీకరణాలపై దృష్టి సారించాయి. దీంతో తమిళనాడు రాజకీయాలు గంట గంటకూ ఆసక్తికరంగా మారుతున్నాయి.ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు త్వరలోనే లభిస్తుందనే ధీమాను టీవీకే శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. చెన్నైలో జరుగుతున్న కీలక సమావేశాల్లో భవిష్యత్ వ్యూహాలపై పార్టీ నాయకత్వం చర్చలు కొనసాగిస్తోంది.
