మే 09, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ను విధ్వంస రాజకీయాల నుంచి అభివృద్ధి పాలన వైపు తీసుకెళ్తున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె, కూటమి ప్రభుత్వ 23 నెలల పాలనలో ప్రజలకు భరోసా కలిగించే పరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా భయపడేవారని, ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె అన్నారు. భయపెట్టే రాజకీయాలకు ముగింపు పలికి, ప్రజా కేంద్రిత పాలన అందిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం అభివృద్ధిపై మాట్లాడుతూ, ఒకప్పుడు వైజాగ్ పేరు వినగానే గంజాయి సమస్య గుర్తుకొచ్చేదని, ఇప్పుడు గూగుల్, టీసీఎస్ వంటి అంతర్జాతీయ సంస్థలు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో గంజాయి సాగు తగ్గించి కాఫీ తోటలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ సాధించడం కూటమి ప్రభుత్వ ముఖ్య విజయాల్లో ఒకటని మంత్రి పేర్కొన్నారు. యువతకు ఆయుధాలు కాకుండా ఉద్యోగాలు, నైపుణ్యాలు, అవకాశాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.అమరావతి నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో అరుదైన సంఘటన అని ఆమె అభివర్ణించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర సహకారంతో పెట్టుబడులు తీసుకువచ్చినట్లు తెలిపారు.గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కఠిన చర్యలు చేపడుతున్నామని సంధ్యారాణి వెల్లడించారు. అలాగే గిరిజనుల అభివృద్ధికి “సూపర్ 6” పథకాలు ఉపయోగపడుతున్నాయని చెప్పారు.ప్రతిపక్ష నాయకత్వంపై విమర్శలు చేస్తూ, యువతను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు.
