మే 09, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్పై పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగర అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ అవసరమని పేర్కొంటూ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.వీఎంఆర్డీఏ పరిధిలో 6,836 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండగా, అందులో 4,387 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని తెలిపారు. మిగిలిన ప్రాంతాలకు అక్టోబర్ నాటికి మాస్టర్ ప్లాన్ పూర్తి చేస్తామని వెల్లడించారు.మాస్టర్ ప్లాన్పై వచ్చిన అభ్యంతరాలు, ప్రజాప్రతినిధుల వినతులపై సమీక్ష నిర్వహించామని, ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన 90 శాతం సమస్యలకు పరిష్కారం చూపినట్లు మంత్రి చెప్పారు. 2021లో రూపొందించిన మాస్టర్ ప్లాన్పై పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో దానిని తిరిగి పరిశీలిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ తరహాలో విశాఖలో సెమి రింగ్ రోడ్డు నిర్మాణానికి సీఎం చంద్రబాబు ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ నెలాఖరుకల్లా డీపీఆర్ సిద్ధమవుతుందని వెల్లడించారు.భోగాపురం విమానాశ్రయానికి బీచ్ కారిడార్ ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎస్టీపీల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పాత విధానాన్నే కొనసాగిస్తున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
