మే 09, (నేటి తెలుగు పత్రిక): అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్లో వడ్లు, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.రైతులు నష్టపోతుంటే సీఎం రేవంత్రెడ్డి ఒక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో కోతల సీజన్లో తరచూ రివ్యూ మీటింగ్లు నిర్వహించి రైతుల అవసరాలు తీర్చేవారని గుర్తుచేశారు.వడ్లు, మక్కలు, సన్ఫ్లవర్ పంటల కొనుగోలు పరిస్థితులను పరిశీలించేందుకు ఒక్క మంత్రి కూడా రైతుల వద్దకు రాలేదని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలకంటే ప్రభుత్వానికి ముఖ్యమైన పని ఇంకేముందని ప్రశ్నించారు. సన్ఫ్లవర్ రైతులు అధికంగా ఉన్న సిద్దిపేట, చిన్నకోడూరు ప్రాంతాల్లో 40 రోజులుగా కొనుగోళ్లు జరగక పంటకు చెదలు పడుతున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేడా లేకుండా రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.పంట మార్పిడి చేయాలని ప్రభుత్వం సూచిస్తోందని, కానీ పండించిన పంటను కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. రైతుబంధు కూడా మూడు పంటలకు అందలేదని ఆరోపిస్తూ, “లేఖలు రాయడం మానేసి ఐకేపీ కేంద్రాలకు వెళ్లి రైతులతో మాట్లాడాలి” అని సీఎం రేవంత్రెడ్డికి సూచించారు.
