మే 10, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయ వర్గాల్లో హనీట్రాప్ ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తనను ఓ కుటుంబం హనీట్రాప్ చేసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తోందంటూ పోలీసులను ఆశ్రయించారు.హైదరాబాద్ కొంపల్లికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడిందని, ఆ సాన్నిహిత్యాన్ని అడ్డంగా పెట్టుకుని ఆమె కుటుంబ సభ్యులు తనపై ఒత్తిడి తెస్తున్నారని భగీరథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పాటు, నిరాకరిస్తే ఫోటోలు, వీడియోలు బయటపెడతామని బెదిరించారని ఆరోపించారు.ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇప్పటికే కొంత మొత్తం కూడా చెల్లించినట్లు భగీరథ్ తెలిపారు. వేధింపులు ఎక్కువ కావడంతో చివరకు పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు.అయితే ఈ కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. భగీరథ్పై యువతి కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మైనర్ అని, ఆమెపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఇద్దరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండటంతో పోలీసులు కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలు, సోషల్ మీడియా చాటింగ్స్ వంటి సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. యువతి మైనరా కాదా అనే అంశంపై కూడా అధికారులు ధ్రువీకరణ చేపట్టారు.
