మే 10, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మాదాపూర్లో రేపు కీలక రాజకీయ భేటీ జరగనుంది. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆయన నివాసానికి వెళ్లనున్నారు. అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్యం గురించి ప్రధాని ఆరా తీసే అవకాశం ఉంది.సాయంత్రం 4 గంటలకు మోదీ పవన్ నివాసానికి చేరుకోనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ నివాసానికి రానుండటం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీకి చిరంజీవి స్వాగతం పలకనున్నట్లు తెలుస్తోంది. మోదీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి భేటీపై సినీ, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.ప్రధాని పర్యటన నేపథ్యంలో మాదాపూర్ పరిసరాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఎస్పీజీ బృందాలు ఇప్పటికే అక్కడికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించాయి. ట్రాఫిక్ ఆంక్షలతో పాటు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్పై కేంద్రం చూపిస్తున్న ఈ ప్రత్యేక చొరవ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
