మే 10, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముందు రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రధానికి బహిరంగ లేఖ రాస్తూ తెలంగాణ ప్రయోజనాలు, సామాజిక న్యాయానికి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించారు.మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని సభకు ముందు విడుదలైన ఈ లేఖలో నాలుగు ప్రధాన డిమాండ్లను కవిత ముందుంచారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఆమె కోరారు. ఈ ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ రైతులకు కీలకమని పేర్కొన్నారు.అలాగే 2027 జనాభా లెక్కల్లో ప్రత్యేక ఓబీసీ కాలమ్ను చేర్చాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గాల అసలు జనాభా గణాంకాలు వెలుగులోకి రావాలంటే కుల ఆధారిత జనగణన అవసరమని అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు ప్రత్యేక ఉపకోటా కల్పించాలని కవిత కోరారు. రాజకీయాల్లో వెనుకబడిన వర్గాల మహిళలకు సముచిత ప్రాతినిధ్యం దక్కాలంటే ఇది అవసరమని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. బిల్లుల ఆమోదం ఆలస్యం కావడం వల్ల బీసీల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్నారు.ప్రధాని తెలంగాణ పర్యటనకు ముందే ఈ లేఖ విడుదల కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీసీ, ఓబీసీ అంశాలను ప్రధాన చర్చగా మార్చే ప్రయత్నంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
