మే 10, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేపల వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్నికల హామీ మేరకు గతంలో ఉన్న రూ.10 వేల సాయాన్ని రెట్టింపు చేసి రూ.20 వేలకు పెంచిన ప్రభుత్వం, ఈ ఏడాది కూడా అదే మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది.మే 19న మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇందుకోసం సుమారు రూ.286 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. చేపల సంతతి పెంపు, సముద్ర వనరుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ ఆంక్షలు విధిస్తారు. ఈ సమయంలో వేలాది మత్స్యకార కుటుంబాలు ఆదాయం కోల్పోతుండటంతో ప్రభుత్వం భృతి అందిస్తోంది.నిషేధ కాలంలో అక్రమంగా వేటకు వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన బోట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు జరిమానాలు విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.అక్రమ వేటను అరికట్టేందుకు కోస్ట్ గార్డ్తో కలిసి తీరప్రాంతాల్లో గస్తీ పెంచినట్లు మత్స్యశాఖ వెల్లడించింది.
