మే 10, (నేటి తెలుగు పత్రిక): తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ హైదరాబాద్లో ‘తలసేమియా రన్’ నిర్వహించింది. నగరంలోని నెక్లెస్ రోడ్ సమీప జలవిహార్ వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడిన నారా భువనేశ్వరి, తలసేమియా కారణంగా ప్రతి ఏడాది వేలాది చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “తలసేమియా బాధితులను కాపాడేందుకు రక్తమార్పిడి ఒక్కటే ప్రధాన మార్గం. రక్తదానం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు” అని తెలిపారు.దేశంలో ప్రతి ఏడాది సుమారు 12 వేల మంది పిల్లలు తలసేమియాతో జన్మిస్తున్నారని పేర్కొంటూ, యువత తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తలసేమియా బాధితులకు రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. విజయవాడ, అనంతపురంలో తలసేమియా కేంద్రాలు, బ్లడ్ బ్యాంకులు పనిచేస్తున్నాయని వెల్లడించిన ఆమె, గత కొన్ని దశాబ్దాలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ బాధితులకు ఉచిత రక్తం, వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు.
