మే 10, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ప్రశాసన్నగర్లో జరిగిన మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న కల్పనను ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం తనూజను ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో పరిస్థితులను పరిశీలించిన అధికారులు ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా భావిస్తున్నారు.హత్య అనంతరం కల్పన తన సహచరులతో కలిసి పరారైనట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్కు వెళ్లి, అక్కడి నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్లో నాగ్పూర్ వైపు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే మధ్యలోనే రైలు దిగిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.నిందితుల కోసం తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. కొన్ని బృందాలు నేపాల్ సరిహద్దుల వరకు వెళ్లినట్లు సమాచారం. దేశం విడిచి పారిపోయే అవకాశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు 200కుపైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మొబైల్ కాల్ డేటా, లొకేషన్ ట్రాకింగ్ ఆధారంగా సైబర్ క్రైమ్ బృందాలు కీలక సమాచారం సేకరిస్తున్నాయి. పనిమనిషిగా చేరిన వ్యక్తి ఇలాంటి దారుణానికి పాల్పడటం స్థానికులను షాక్కు గురిచేసింది. మరోవైపు తనూజ మృతి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచింది.
