మే 10, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో కొత్త రాజకీయ శైలికి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన తొలి మంత్రివర్గాన్ని ప్రకటించారు. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా యువత, నిపుణులు, వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన ఈ కేబినెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.చెన్నైలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం విడుదలైన మంత్రివర్గ జాబితాలో 29 ఏళ్ల సినీ నటి ఎస్. కీర్తనకు మంత్రి పదవి దక్కడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. శివకాశి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కీర్తన విజయ్ కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచారు. రాజకీయ అనుభవం తక్కువైనా యువతలో ఉన్న ఆదరణ, మహిళా ప్రతినిధిత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న విజయ్ ఆలోచన కారణంగా ఆమెకు అవకాశం లభించినట్లు టీవీకే వర్గాలు చెబుతున్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కీర్తనకు మంత్రి బాధ్యతలు అప్పగించడం తమిళ రాజకీయాల్లో కొత్త ప్రయోగంగా భావిస్తున్నారు.విజయ్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎన్. ఆనంద్కూ కేబినెట్లో కీలక స్థానం లభించింది. ఒకప్పుడు విజయ్ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, టీవీకే పార్టీ నిర్మాణంలో గ్రామస్థాయిలో కీలక పాత్ర పోషించారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో విజయ్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది.మాజీ బాస్కెట్బాల్ క్రీడాకారుడు ఆధవ్ అర్జున్కు కూడా మంత్రి పదవి దక్కింది. రాజకీయ వ్యూహరచనలో అనుభవం, యువతలో ప్రభావం ఉండటంతో ఆయనను కేబినెట్లోకి తీసుకున్నట్లు సమాచారం. క్రీడా రంగానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కొత్త తరహా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.పరిపాలనా అనుభవం ఉన్న మాజీ ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ కేజీ అరుణ్రాజ్ను కూడా విజయ్ తన మంత్రివర్గంలో చేర్చారు. ప్రభుత్వ వ్యవస్థపై పట్టు, ఆర్థిక రంగంపై అవగాహన ఉండటంతో ఆయనకు కీలక శాఖ కేటాయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ప్రఖ్యాత దంత వైద్యుడు డాక్టర్ టీకే ప్రభుకు కూడా మంత్రి పదవి దక్కింది. ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో వైద్య రంగ నిపుణులకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.విజయ్ కేబినెట్ను పరిశీలిస్తే యువత, మహిళలు, నిపుణులకు పెద్దపీట వేస్తూ కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. సంప్రదాయ రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు అవకాశం ఇవ్వడం ద్వారా విజయ్ తనదైన పాలన శైలిని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
