మే 10, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2025కు కుప్పం ఎంపిక కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, కుప్పంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు కింద కుప్పం దేశంలో మూడో స్థానం సాధించడంతో పాటు రూ.1.50 కోట్ల నగదు బహుమతి గెలుచుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.
“అభివృద్ధికి అంకితభావం తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయో కుప్పం నిరూపించింది” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విజయానికి కృషి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరిస్తున్న కుప్పం ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.కుప్పాన్ని దేశానికే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఇదే స్పూర్తితో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.అలాగే గ్రామీణాభివృద్ధి రంగంలో ఆంధ్రప్రదేశ్కు జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపుపై కూడా చంద్రబాబు స్పందించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్–2025 అవార్డుల్లో రాష్ట్రం రెండో స్థానం సాధించడం గర్వకారణమన్నారు. పంచాయతీరాజ్ శాఖను సమర్థవంతంగా నడిపిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శృంగవరం, బొక్కసంపాలెం, చెముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
