మే 11, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాల సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేసిన సీఎం, రాష్ట్ర ప్రభుత్వం కూడా “తెలంగాణ రైజింగ్-2047” దిశగా ముందుకు సాగుతోందన్నారు.హెచ్ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ, గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు లభించేలా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేక “సింగిల్ విండో టాస్క్ ఫోర్స్” ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు సంబంధించిన రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైలు విస్తరణ, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్-మచిలీపట్నం 12 లేన్ల ఎక్స్ప్రెస్ హైవే వంటి ప్రతిపాదనలను కేంద్రం అత్యవసరంగా ఆమోదించాలని కోరారు.
దేశ ఆర్థికాభివృద్ధిలో మహానగరాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న సీఎం, హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు తరహాలో హైదరాబాద్ను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరమని స్పష్టం చేశారు.వికసిత్ భారత్-2047 లక్ష్యాల ప్రకారం దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చాలన్న ప్రధాని లక్ష్యానికి తెలంగాణ కూడా తన వంతు సహకారం అందిస్తుందని సీఎం తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం ఆమోదిస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. వరంగల్లోని పీఎం మిత్రా పార్క్ (కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్), సంగారెడ్డి-జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, మహబూబ్నగర్-గూడబెల్లూరు జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే కాజిపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టును ప్రారంభించగా, హైదరాబాద్ మల్కాపూర్లో ఇండియన్ ఆయిల్ గ్రీన్ఫీల్డ్ టెర్మినల్ను జాతికి అంకితం చేశారు.




