మే 11, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టాలు వేగంగా పడిపోతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 7 జిల్లాల్లోని 258 గ్రామాల్లో కొత్త బోర్ల తవ్వకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నీటి కొరత తీవ్రం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.శ్రీకాకుళం, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వ్యవసాయ, వాణిజ్య అవసరాల కోసం కొత్త బోర్లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అయితే ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని హ్యాండ్ బోర్లకు మినహాయింపు ఇచ్చారు.భూగర్భ జలాలపై అధిక ఒత్తిడి, వర్షాభావ పరిస్థితులు, అధిక నీటి వినియోగం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇసుక తవ్వకాల వల్ల కూడా నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలపైనా నిషేధం విధించారు.
