మే 11, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు సంబంధించిన కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా స్పందించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదుపై ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని డీజీపీ సీవీ ఆనంద్ను సీఎం ప్రశ్నించారు. వెంటనే కేసు దర్యాప్తు ప్రారంభించి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.మే 8న ఫిర్యాదు నమోదు అయినప్పటికీ ఆలస్యం జరగడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసు పరిస్థితిని డీజీపీ సీఎంకు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన కారణంగా పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో విచారణ ఆలస్యమైందని తెలిపారు.అయితే కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. కేసులో ఉన్న ప్రతి అంశాన్ని నిష్పక్షపాతంగా విచారించి నిజాలు వెలికి తీయాలని సూచించినట్లు తెలుస్తోంది.ఈ ఘటన రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం స్వయంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసు దర్యాప్తు పురోగతిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
