కృష్ణా జిల్లా, మే 11, (నేటి తెలుగు పత్రిక): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పోలీస్ వ్యవస్థను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 6000 మంది పోలీసులను భర్తీ చేసి వ్యవస్థను బలోపేతం చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలను తగ్గించడంలో కృష్ణా జిల్లా ముందంజలో ఉందని హోం మంత్రి ప్రశంసించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొన్నారు.
