మే 11, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికు కట్టడం కంటే కూల్చడమే ఎక్కువగా తెలుసని ఆరోపించారు.పేదల ఇళ్లతో పాటు పురాతన ఆలయాలను కూడా కూల్చేస్తున్నారని మండిపడ్డ హరీష్రావు, గుప్తనిధుల కోసమే ఆలయాలను తవ్వుతున్నారేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. ఆలయ గర్భగుడి కింద 24 అడుగుల వరకు తవ్వకాలు జరిగాయని, ఈ విషయాన్ని పురావస్తు శాఖ అధికారులే గుర్తించారని తెలిపారు.నిజంగా పాఠశాల నిర్మాణం కోసమే పనులు చేస్తే అర్ధరాత్రి వేళల్లో తవ్వకాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఆలయ కూల్చివేత ఘటనపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని విమర్శించారు.ఆలయ స్థలాన్ని, నిర్మాణాన్ని వెంటనే పురావస్తు శాఖకు అప్పగించాలని హరీష్రావు డిమాండ్ చేశారు.
