మే 12, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను పొగాకు, మద్యం, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మేరకు గవర్నర్తో జరిగిన సమావేశంలో పలు అంశాలను ఆయన వివరించారు. లోక్భవన్లో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ రోజునే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల చదువుకు ఉపయోగపడే విధంగా ప్రత్యేకంగా సిద్ధం చేసిన కిట్లలో యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, పాఠశాల సంచులు, క్రీడా దుస్తులు తదితర అవసరమైన వస్తువులు అందజేయనున్నట్లు చెప్పారు.అదేవిధంగా పాఠశాలలు, కళాశాలల పరిసరాలను వ్యసనాల రహితంగా తీర్చిదిద్దేందుకు విద్యాసంస్థల యాజమాన్యాలు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, వారిలో చైతన్యం కల్పించడం, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని పెంచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ, పోలీసు శాఖ, ఈగిల్ బృందం సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాలు, అవగాహన సభలు, చైతన్య ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు మంచి అలవాట్లు అలవరుచుకొని భవిష్యత్తులో బాధ్యతగల పౌరులుగా ఎదగాలంటే విద్యాసంస్థలతో పాటు కుటుంబాల సహకారం కూడా ఎంతో అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది. విద్యాసంస్థలను సురక్షితమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత వాతావరణంగా మార్చడం ద్వారా యువతను సరైన దారిలో నడిపించాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి గవర్నర్కు వివరించారు.

