మే 12, (నేటి తెలుగు పత్రిక): సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సరోగసి కుంభకోణం కేసులో డాక్టర్ నమ్రతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యవహారం వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమని స్పష్టం చేసింది.2024 జూలైలో రాజస్థాన్కు చెందిన ఓ దంపతుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సరోగసి ద్వారా తమకు బిడ్డ పుట్టిందని చెప్పి రూ.35 లక్షలు తీసుకుని, చివరకు వేరే శిశువును అప్పగించారని వారు ఆరోపించారు. డీఎన్ఏ పరీక్షల్లో ఆ శిశువుకు తమతో జీవ సంబంధం లేదని తేలడంతో పోలీసులను ఆశ్రయించారు.ఈ కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన మరికొంతమంది బాధితులు కూడా ఫిర్యాదులు చేశారు. సరోగసి పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రస్తుతం పోలీసులు, వైద్య శాఖ అధికారులు ఫెర్టిలిటీ సెంటర్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని సమాచారం.
