మే 12, (నేటి తెలుగు పత్రిక): వరంగల్ జిల్లాలో చైన్ స్నాచింగ్ ఘటనలు వరుసగా చోటుచేసుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సోమవారం రాత్రి ఒక్కరోజే మూడు చోట్ల దుండగులు బంగారు గొలుసులు లాక్కెళ్లడం కలకలం రేపింది. ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తి కూడా ఈ ఘటనల్లో బాధితుడిగా మారినట్లు సమాచారం.వరంగల్ మిల్స్ కాలనీలో రాత్రి వేళ బైక్లపై తిరుగుతున్న కొందరు యువకులు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో ఓ టీ స్టాల్ యజమానిపై దుండగులు దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.నగరంలో రాత్రి వేళ పోలీసు పెట్రోలింగ్ సరిగా కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసి చైన్ స్నాచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఇక ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో కూడా దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంటి తాళాలు పగులగొట్టి భారీగా బంగారు నగలు, వెండి వస్తువులు అపహరించినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఘటనలతో ప్రజల్లో భద్రతపై ఆందోళన పెరుగుతోంది. నేరాల నియంత్రణకు పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.
