మే 12, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఎం విజయ్ తీసుకున్న కీలక నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, దేవాలయాలు, బస్టాండ్ల సమీపంలో కొనసాగుతున్న 717 మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రజల నుంచి చాలా కాలంగా వస్తున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా మహిళా సంఘాలు, తల్లిదండ్రులు, సామాజిక సంస్థలు ఈ చర్యను స్వాగతిస్తున్నాయి.పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాల సమీపంలో మద్యం దుకాణాలు ఉండటం వల్ల విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతోందని, మహిళలకు అసౌకర్యం కలుగుతోందని గతంలో పలుమార్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశంపై దృష్టి సారించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నిర్ణయంపై ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ స్పందిస్తూ సీఎం విజయ్ను అభినందించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆయన చేసిన పోస్టులో, “తమిళ కుటుంబాల ఆకాంక్షలను గౌరవిస్తూ సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం” అని పేర్కొన్నారు.ప్రజా సంక్షేమం, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుందని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టాస్మాక్ మద్యం దుకాణాలపై గతంలో కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దుకాణాల సంఖ్య తగ్గించాలని, ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల పరిసరాల్లో ఉన్న షాపులను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు 717 మద్యం దుకాణాల మూసివేతతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశంపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
