సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పెండింగ్ బిల్లుల విడుదలకు నిర్ణయం: భట్టి విక్రమార్క
హైదరాబాద్: సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పెండింగ్ బిల్లుల విడుదలపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన భట్టి, బిల్లుల విడుదలకు సంబంధించి గమనించిన అంశాలను పంచుకున్నారు.
సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు సుమారు రూ.1,300 కోట్ల వరకు ఉన్నాయని, వాటిలో రూ. 10 లక్షల లోపు ఉన్న బకాయిల విలువ సుమారు రూ.400 కోట్లు ఉన్నట్లు భట్టి వెల్లడించారు. మొదటగా, రూ.10 లక్షల లోపు ఉన్న పెండింగ్ బిల్లులను విడుదల చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పడుతున్న ఇబ్బందులను గమనించి తీసుకున్నట్లు తెలిపారు.
మాజీ ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులతో పనులు చేస్తూ బిల్లులను పెండింగ్లో పెట్టినట్లు విమర్శలు చేశారు. ఈ సమస్యకు కారణమైన భారాస నేతలే ఇప్పుడు పెండింగ్ బిల్లుల విడుదల కోసం ధర్నాలు చేయాలని ప్రకటనలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “ఈ అంశంపై భారాస నేతలు ఎంత తక్కువ మాట్లాడితే, అంత మంచిది” అని వ్యాఖ్యానించారు.
