మాజీ ప్రధాని వాజ్పేయీ జయంతి సందర్భంగా ‘సదైవ్ అటల్’ వద్ద ప్రముఖుల నివాళులు
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ (Atal Bihari Vajpayee) శతజయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులర్పణలు జరిగాయి. దిల్లీలోని ‘సదైవ్ అటల్’ వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సహా పలువురు ప్రముఖులు వాజ్పేయీకి ఘనంగా నివాళులర్పించారు.
వాజ్పేయీ దూరదృష్టి వల్లే దేశం అభివృద్ధి పథంలో
వాజ్పేయీ శతజయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) “ఎక్స్”లో చేసిన పోస్ట్లో ఆయనను ప్రశంసించారు.
“భారత జాతి గర్వించదగిన నేత అటల్ బిహారీ వాజ్పేయీ. ఆయన దూరదృష్టి కారణంగా భారతదేశం నేడు ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. దేశం అభివృద్ధిపై ఆయన చూపిన విలక్షణమైన దృష్టి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుంది. సంస్కరణల ప్రతిపాదనలపై ఆయన చూపిన స్పందన మరవలేనిది. ఆయనకు నా ప్రగాఢ నివాళులు” అంటూ చంద్రబాబు పోస్ట్ చేశారు.
వాజ్పేయీ స్మరణకు దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాల్లో అనేక మంది రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొని తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.
