మే 12, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాల కోసం ఇచ్చిన సూచనలను కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలో వక్రీకరిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.దేశ ఆర్థిక స్వావలంబన, ప్రజల బాధ్యతాయుత జీవనశైలికి సంబంధించిన సూచనలను సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తప్పుగా ప్రజల్లో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు తమ చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు.1949లో జవహర్లాల్ నెహ్రూ బియ్యం వినియోగం తగ్గించాలని ప్రజలకు సూచించారని, 1965లో లాల్ బహదూర్ శాస్త్రి వారానికి ఒకపూట భోజనం మానాలని పిలుపునిచ్చారని రాంచందర్ రావు గుర్తుచేశారు. ఆర్థిక సంక్షోభాల సమయంలో ఇందిరాగాంధీ, పి. చిదంబరం, మన్మోహన్ సింగ్ కూడా ప్రజలకు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించిన విషయాన్ని ప్రస్తావించారు.సౌరశక్తి వినియోగం, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, ప్రజా రవాణా వినియోగం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి అంశాల్లో ప్రధాని సూచనలు దేశ ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. ఇవి బలవంతపు ఆంక్షలు కాదని, ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా పాటించాల్సిన బాధ్యతగా చూడాలని అన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ భారత్లో ధరలను స్థిరంగా ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని తెలిపారు. యూపీఏ పాలనతో పోలిస్తే ఎన్డీఏ హయాంలో దేశం ఆర్థికంగా బలపడిందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 5వ స్థానానికి చేరుకుందని చెప్పారు.బీజేపీకి దేశ ప్రయోజనాలే ముఖ్యమని, కాంగ్రెస్కు మాత్రం అధికార రాజకీయాలే ప్రాధాన్యమని రాంచందర్ రావు విమర్శించారు.
