మే 12, (నేటి తెలుగు పత్రిక): రొయ్యల ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచిన ఫీడ్ కంపెనీలపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా ధరలు పెంచడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు.వనామీ ఫీడ్పై రూ.8, టైగర్ ఫీడ్పై రూ.10 వరకు ధరలు పెంచినట్లు మంత్రి తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, APSADA చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలని ఫీడ్ కంపెనీలను హెచ్చరించారు.పెంచిన ధరల అమలును వెంటనే నిలిపివేయాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఫీడ్ ధరల పెంపుపై కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాతే అమలు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆక్వా రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు అన్యాయం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆక్వా రైతుల పక్షాన నిలుస్తుందని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
