మే 12, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్జెండర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకు కొత్త సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం-2019 ప్రకారం ఈ నియామకాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాంతీయ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ విశాఖపట్నం కలెక్టర్ను ఆంధ్ర ప్రాంత ప్రతినిధిగా, తిరుపతి కలెక్టర్ను రాయలసీమ ప్రతినిధిగా ప్రభుత్వం నామినేట్ చేసింది. దీనివల్ల ట్రాన్స్జెండర్ల సమస్యలు స్థానిక స్థాయిలో వేగంగా పరిష్కారమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.అలాగే కోట ప్రేమ్ సాగర్ రాయ్, నక్క జీవన్ కుమారి, బోను దుర్గలను ట్రాన్స్జెండర్ ప్రతినిధులుగా బోర్డులో సభ్యులుగా నియమించింది. ట్రాన్స్జెండర్ వర్గాల సమస్యలు నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నియామకాలు ఉపయోగపడనున్నాయి.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సభ్యుల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ జీఓ ఎంఎస్ నంబర్-14ను విడుదల చేసింది. ట్రాన్స్జెండర్లకు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక భద్రత రంగాల్లో మరింత మద్దతు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
