మే 12, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లపై క్రిమినల్ కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.సోషల్ మీడియాలో తనపై అవమానకర ప్రచారం జరిగిందని జస్టిస్ శర్మ ఆక్షేపించారు. కోర్టులపై ప్రజల్లో అనుమానాలు కలిగించేలా దుష్ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారం జరిగిందని ఆమె అభిప్రాయపడ్డారు.ఈ వ్యవహారంలో తానే కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తున్నందున, అదే కేసును విచారించడం సముచితం కాదని పేర్కొంటూ విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. కేసును మరో బెంచ్కు బదిలీ చేయాలని ఆదేశించారు.అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, వినయ్ మిశ్రా, సౌరభ్ భరద్వాజ్లపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభమైనట్లు సమాచారం. న్యాయమూర్తులపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం, సోషల్ మీడియాలో దూషణలకు పాల్పడటం, కోర్టు నిష్పక్షపాతంపై సందేహాలు రేకెత్తించడం వంటి అంశాలను కోర్టు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.ఇదివరకు జస్టిస్ శర్మ ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కేజ్రీవాల్ కోరారు. ఆమె కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ న్యాయవాదులుగా ఉండటం వల్ల నిష్పక్షపాతంపై సందేహాలు ఉన్నాయని వాదించారు. అయితే ఆ వాదనలను కోర్టు తిరస్కరించింది.
